Politics

ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలి*

ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలి*

శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన కలెక్టర్, సీపీ

 

అపశృతులకు తావులేకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశం

నిజామాబాద్, నిఘానేత్రం ప్రతినిధి సెప్టెంబర్ 10 : ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనవార్, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ మంగళవారం వినాయక శోభాయాత్ర కొనసాగే మార్గాన్ని పరిశీలించారు. అంతకుముందు పోలీస్ కమిషనరేట్ లో ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి కలెక్టర్, సీ.పీ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ లతో కలిసి సంబంధిత అధికారులతో వినాయనక నిమజ్జనోత్సవ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి అపశ్రుతులు తావులేకుండా ఆనందోత్సాహాల నడుమ భక్తి శ్రద్ధలతో నిమజ్జనోత్సవం జరుపుకోవాలని ప్రజలను కోరారు. ఎలాంటి వదంతులను నమ్మవద్దని, పరస్పర సహకారంతో గణేష్ ఉత్సవాలు, మిలాద్-ఉన్-నబీ వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. నిజామాబాద్ తో పాటు బోధన్, ఆర్మూర్ పట్టణాలలో సైతం నిమజ్జన ఉత్సవం సాఫీగా జరిగేలా తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ వేడుకల సందర్భంగా ఎవరైనా అల్లర్లు సృష్టించేందుకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. ఈ మేరకు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, శోభాయాత్ర కొనసాగే మార్గాలలో సీ.సీ కెమెరా నిఘా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని సీ.పీ కల్మేశ్వర్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి అదనంగా మరో 20 శాతం వరకు వినాయక ప్రతిమలు ప్రతిష్టించడం జరిగిందని, ఇందుకు అనుగుణంగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తామన్నారు.

కాగా, జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతం నుండి శోభాయాత్ర ప్రారంభం కానుండగా, భారీ విగ్రహాలను నిమజ్జనం చేసే యంచ శివారులోని బాసర బ్రిడ్జి వరకు గల మార్గాన్నికలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సీ.పీ కల్మేశ్వర్ పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా అక్కడక్కడా చెడిపోయి ఉన్న రోడ్డును యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రోడ్లకు ఇరువైపులా అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను పైకి భిగించాలని సూచించారు. జానకంపేట్ రైల్వే క్రాసింగ్ మీదుగా ఎనిమిది అడుగులకు పైబడి ఎత్తు కలిగిన విగ్రహాలను తరలించే వీలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గంగా నందిపేట మండలంలోని ఉమ్మెడ గోదావరి పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించారు. భారీ విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్లను అందుబాటులో ఉంచాలని, తగిన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిమజ్జనోత్సవంలో ఏ చిన్న ప్రమాదానికి కూడా ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్త చర్యలన్నీ చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా బాసర బ్రిడ్జి వద్ద కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, వినాయక నిమజ్జన శోభాయాత్రకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ శోభాయాత్ర నిర్వహించుకోవాలని హితవు పలికారు. ప్రధానంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా, నీటిలో మునిగి గల్లంతు కావడం, రోడ్డు ప్రమాదాలకు గురి కావడం వంటి ఘటనలు ఎక్కువగా జరిగేందుకు ఆస్కారం ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పోలీస్, ఫైర్, ఆర్ అండ్ బీ, ట్రాన్స్కో, పంచాయతీరాజ్, ఫిషరీస్ తదితర శాఖలన్నీ సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు. జానకంపేట్ రైల్వే క్రాసింగ్ వద్ద హై వోల్టేజ్ విద్యుత్ లైన్ ఉన్నందున ఎనిమిది అడుగుల కంటే ఎక్కువ ఎత్తు కలిగిన భారీ విగ్రహాలను ప్రత్యామ్నాయ మార్గం ద్వారా నిమజ్జనానికి తరలించాలని సూచించారు. ఈ మేరకు నందిపేట మండలం ఉమ్మెడ వద్ద కూడా నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. బాసర బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వన్ వే విధానాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. పోలీసులతో సమన్వయం చేసుకుని, వారి సూచనలు పాటిస్తూ, నిర్దేశించిన మార్గం మీదుగా శోభాయాత్ర జరపాలని గణేష్ మండపాల నిర్వాహకులను కలెక్టర్ కోరారు.

కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, అదనపు డీసీపీ కోటేశ్వర్ రావు, మున్సిపల్, ఆర్ అండ్ బీ, అగ్నిమాపక, ఫిషరీస్, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button