Home

*ప్రజా పాలనా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు*

హైదరాబాద్,(నిఘానేత్రం ప్రతినిధి) సెప్టెంబర్ 12 :: ఈనెల 17 వతేదీన నిర్వహించే ప్రజా పాలనా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ప్రజా పాలనా దినోత్సవ నిర్వహణ ఏర్పాట్లపై డా. బీ.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ఉన్నత స్థాయి అధికారుల సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేడు నిర్వహించారు. ప్రజాపాలన దినోత్సవమైన 17 వ తేదీన ఉదయం ముఖ్యమంత్రి అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులు అర్పిస్తారని, అనంతరం పబ్లిక్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. పబ్లిక్ గార్డెన్ లో పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి గారి ప్రసంగం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులను సి.ఎస్. ఆదేశించారు. సభా స్థలంలో మౌలిక సదుపాయాల కల్పన, ఆహ్వానితుల వాహనాలకు సరైన పార్కింగ్ సదుపాయం, శానిటేషన్, పీఏ సిస్టం, భద్రతా తదితర ఏర్పాట్లను చేపట్టాలని అన్నారు. 17 న గణేష్ నిమజ్జనం ఉన్నందున ఈ సమావేశానికి హాజరయ్యే వారికి ట్రాఫిక్ నియంత్రణ, తగు మార్గాలను ముందస్తుగా తెలియచేయాలని నగర పోలీసు అధికారులకు సూచించారు. నగరంలోని అన్ని ప్రధాన కార్యాలయాలు, పర్యాటక భవనాలను విధ్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో డీజీపీ జితేందర్, హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సి.వీ ఆనంద్, ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి రవీ గుప్తా, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్, డీజీ ఫైర్ సర్వీసులు డీజీ నాగి రెడ్డి, జీఏడీ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, జీహెచ్ ఎంసీ కమీషనర్ ఆమ్రపాలి, సమాచార శాఖ ప్రత్యేక కమీషనర్ హనుమంత రావు, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button