Politics

*పేద, ధనిక అనే తేడా లేదు* *• తెలంగాణలోని ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు* *• పైలట్ ప్రాజెక్టు పర్యవేక్షణకు ఆర్డీవో స్థాయి ప్రత్యేక అధికారులు* *• ఎల్‌ఆర్‌ఎస్ ను వేగవంతం చేయాలి* *• దసరా లోపు లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు* *• యూ‌డి‌ఏ పరిధి పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి* *• సన్న, దొడ్డు రకాల ధాన్యం కొనుగోలుకు వేరువేరుగా కేంద్రాలు* *• యుద్ధ ప్రతిపాదికన వరద ప్రాంతాలలో మరమత్తులు చేపట్టాలి* *- జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి*

*హైదరాబాద్, 1 అక్టోబర్, 2024:(నిఘానేత్రం ప్రతినిధి)* పేద, మధ్య, ధనిక వర్గాలు, కుటుంబాలు అనే తేడా లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం హెల్త్ ప్రొఫైల్ రూపొందించి, యూనిక్ నెంబర్ తో స్మార్ట్ కార్డు ఇవ్వడమే ఫ్యామిలీ కార్డు ప్రధాన ఉద్ధేశ్యమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వీలైనంత మేరకు వారికి మేలు చేయాలన్న సంకల్పంతోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డును తీసుకొస్తున్నామని వెల్లడించారు.

 

అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ కార్డులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, వాస్తవానికి దగ్గరగా జాగ్రత్తగా కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

 

తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుండి మంగళవారం నాడు చీఫ్ సెక్రెటరీ శ్రీమతి శాంతి కుమారి తో కలిసి ఫ్యామిలీ డిజిటల్ కార్డు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటి (యూ‌డి‌ఏ), ఎల్‌ఆర్‌ఎస్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ధాన్యం కొనుగోళ్ళు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ల తో మంత్రిగారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ

 

తెలంగాణ ఫ్యామిలి డిజిటల్ కార్డుల జారీకి సంబంధించి 119 నియోజకవర్గాలలోని 238 ప్రాంతాలలో పైలట్ ప్రాజెక్టు నిర్వహిస్తున్నామని ఇప్పటికే ఈ ప్రాంతాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంచుకోవాలని, ఒకవేళ పూర్తిగా పట్టణ / నగర నియోజకవర్గాలైతే రెండు వార్డులు / డివిజన్లు ఎంచుకోవాలని సూచించారు. ఈ నెల మూడవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ఎంపిక చేసిన ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో (డోర్-టు-డోర్) వివరాలను పకడ్బందీగా సేకరించాలని సూచించారు. ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించేందుకు గాను ప్రతి నియోజకవర్గానికి ఆర్డీవో స్థాయి, జోనల్ కమిషనర్ స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే మండలానికి ఒక తహశీల్దారును కూడా నియమిస్తున్నట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యుల వివరాల నమోదు, మార్పులు చేర్పుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హెల్త్ కార్డుల విధానం, అమలు వాటి ఫలితాలపై తెలంగాణ అధికారుల బృందం మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, హర్యానా రాష్ట్రాలలో పర్యటించి ముఖ్యమంత్రి తో పాటు క్యాబినెట్ సబ్-కమిటీకి నివేదిక అందజేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి దీనిపై సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందని దానికి అనుగుణంగానే పైలట్ ప్రాజెక్టు నిర్వహిస్తున్నామని ఈ నెల మూడవ తేదీన ఈ పైలట్ ప్రాజెక్టు ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడించారు.

 

ఈ పైలట్ ప్రాజెక్టులో ఎదురయ్యే మంచి చెడులను, పరిగణనలోకి తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా అమలు అంశాన్ని పరిశీలిస్తామన్నారు.

 

*ఎల్‌ఆర్‌ఎస్ :*

గత నాలుగు సంవత్సరాలనుంచి లక్షలాది మంది ఎల్‌ఆర్‌ఎస్ కోసం ఎదురు చూస్తున్నారని, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా యుద్ధ ప్రతిపాదికన దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో జరగడం లేదని, కొన్ని జిల్లాల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు ఉంటే పదుల సంఖ్యలో పరిష్కరించడం పట్ల మంత్రిగారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

*అర్బన్ డెవలప్మెంట్ అథారిటి (యూ‌డి‌ఏ):*

అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (యూ‌డి‌ఏ)ల పరిధి పెంపు, కొత్త యూ‌డి‌ఏల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను తక్షణమే కలెక్టర్లు పంపించాలని ఆదేశించారు.

 

*డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు:*

గత ప్రభుత్వం ఎంతో గొప్పగా ఆర్భాటంగా ప్రకటించి అరకొరగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించిందని, ఇందులో కొన్ని మాత్రమే పూర్తి అయ్యాయని, ఈ పూర్తి అయిన ఇండ్లకు లబ్దిదారులను ఎంపిక చేసి దసరా లోపు వారికి అప్పగించాలని కలెక్టర్లకు ఆదేశించారు. ఇందుకోసం జిల్లా ఇన్-చార్జ్ మంత్రి ఛైర్మన్ గా, జిల్లా కలెక్టర్ కన్వీనర్ గా మరికొంతమంది సభ్యులతో కమిటీ ని ఏర్పాటు చేస్తామన్నారు.

 

*వరద సహాయం :*

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రప్రభుత్వం 29 జిల్లాలకు, ఒక్కో జిల్లాకు మూడు కోట్ల రూపాయల చొప్పున, ఖమ్మం, సూర్యపేట, కొత్తగూడెం, మహబూబాబాద్ నాలుగు జిల్లాలకు ఒక్కో జిల్లాకు ఐదు కోట్ల రూపాయల చొప్పున, మున్సిపాలిటీలకు కోటి రూపాయలు, కార్పొరేషన్లకు రెండు కోట్ల రూపాయల చొప్పున కేటాయించడం జరిగిందని, వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించి తక్షణమే మరమత్తులు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, అంగన్ వాడీ కేంద్రాలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి మరమత్తులు చేపట్టాలన్నారు.

 

*ధాన్యం కొనుగోలు :*

తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ 35 సన్న రకాల ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఈ ఖరీఫ్ సీజన్ నుంచే అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా 7144 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, సన్న ధాన్యానికి దొడ్డు ధాన్యానికి వేరువేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 50 లక్షల మెట్రిక్ టన్నుల వరకు సన్నరకాలు 30 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం వస్తుందని అంచనా వేస్తూ దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

 

రైతాంగానికి ఏ చిన్న సమస్య కూడా రాకుండా కొనుగోళ్లను ప్రక్రియను కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఐటిల పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డీ.ఎస్. చౌహాన్, పంచాయత్ రాజ్ కార్యదర్శి శ్రీ లోకేశ్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, హౌసింగ్ కార్యదర్శి శ్రీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button